విజయవాడ :
స్థలాలు కొనకూడదా?
ఆస్తులు సంపాదించుకోకూడదా?: ఏపీ సీఎం చంద్రబాబు
* మా వాళ్లకే పనులు అవుతాయి.. వాళ్లు మాకు ఓట్లేశారు
* అటాచ్మెంట్లో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులతో లోకేశ్కు ముడిపెడతారా?
* కథనాలతో వ్యక్తులుగా డ్యామేజ్ అయ్యాం
* రాసిన వాటన్నింటికీ ఆధారం చూపాలి.. అవసరమైతే కోర్టుద్వారా సంగతి తేలుస్తాం
* అమరావతి ఆరోపణలపై విచారణ ఎందుకు?దాని కోసం ఢిల్లీ నుంచి సీబీఐని తేవాలా?
తాము భూములు కొనుక్కోకూడదా? ఆస్తులు సంపాదించుకోకూడదా? అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. భూములు కొంటే తప్పేమిటని నిలదీశారు. భూముల కొనుగోళ్లలో అవినీతి చోటుచేసుకుంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన గురువారం విజయవాడలోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అమరావతి భూముల వ్యవహారంపై విచారణ ఎందుకు? దానికోసం ఢిల్లీ నుంచి సీబీఐ వాళ్లను తీసుకొచ్చి విచారణ చేయించాలా? అని వ్యాఖ్యానించారు. తప్పు చేస్తే తాట తీస్తానని చెప్పారు. కథనాలతో వ్యక్తులుగా డామేజ్ అయ్యామని, అమరావతి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని ఆరోపించారు. రాసిన వాటన్నింటికీ ఆధారం చూపాలని, అవసరమైతే కోర్టుద్వారా.. ప్రభుత్వపరంగా, అధికారికంగా అన్నీ తేలుస్తామని హెచ్చరించారు.
ఆ పత్రిక ప్రజల ఆస్తి
‘‘ఇటుక ఇటుక పేర్చి అమరావతి బ్రాండ్ ఇమేజ్ను పెంచితే దానికి అడ్డుతగులుతున్నారు. ఆటాచ్మెంట్లో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను లోకేశ్కు ముడిపెట్టడం ఏమిటి? ఎన్నికల సమయంలోనే నా ఆస్తుల వివరాలతో కూడిన అఫిడవిట్ ఇచ్చాను. నేను ఇచ్చిన ఆస్తుల వివరాల కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నట్లు నిరూపించినా ఆ డబ్బుతోపాటు విచారణకు అయిన ఖర్చులు కూడా ఇస్తానని గతంలోనే ప్రతిపక్షాలకు స్పష్టం చేశాను. అవినీతి డబ్బుతో పెట్టిన పత్రిక ఉందని ఇష్టానుసారంగా రాసి ఇమేజ్ను దెబ్బతీస్తే సహించం. రాసిన వాటిని నిరూపించాలి. ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) అటాచ్మెంట్లో ఉన్న ఆ పత్రిక, సిమెంట్ కర్మాగారం ప్రజల ఆస్తి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
దేశాలు తిరిగి అడుక్కోవాల్సిన అవసరం నాకేంటి?
‘‘కావాలంటే నేను తిరుపతిలోనో, నా ఇంటి ముంగిటో రాజధాని కట్టుకోవచ్చు. రాష్ట్రానికి మధ్యలో, అమరావతి ప్రాంతంలో రాజధాని బాగుంటుందని కడుతుంటే అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తున్నారు. నాకున్న పరిచయం, అంతకు ముందు ఉన్న పరిచయంతో సింగపూర్ వాళ్లు ఆరు నెలల్లో మాస్టర్ప్లాన్ ఇస్తే దాన్ని కూడా కొందరు రాజకీయం చేస్తున్నారు. ఈరోజు బ్రిటిష్ ప్రతినిధి వచ్చి మాట్లాడి వెళ్లారు. కొద్దిరోజుల్లో లండన్ వెళ్లి బ్రిటీష్ వాళ్లతో పెట్టుబడుల గురించి చర్చిస్తా. ఇలా దేశాలు తిరిగి అడుక్కోవాల్సిన అవసరం నాకేంటి? రాష్ర్ట అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం. నిన్నమొన్న రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు, మొదటిసారి రాజకీయాల్లో అడుగుపెట్టిన వాళ్లు నాపై చేస్తున్న విమర్శలను చూస్తుంటే బాధ కలుగుతోంది. ప్రజల కోసం భరిస్తున్నా’’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
తెలియకపోతే మిత్రపక్షంగా తెలుసుకోవాలి
పోలవరం ప్రాజెక్ట్ విషయంలో బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి ఘాటుగా స్పందించారు. ‘‘బీజీపీ నాయకులకు తెలియకపోతే మిత్రపక్షంగా విషయాలు తెలుసుకుంటే మంచిది. మిత్రపక్షంగా మిత్రధర్మం ఉంటుంది. డిఫర్ అవ్వాలంటే వేరేలా ఉంటుంది. కొన్ని కొన్ని జరుగుతుంటాయి. వాటిపై మిత్రపక్షంగా ఫాలోఆప్ చేసుకుని ముందుకెళ్లాలి. అదే ప్రతిపక్షంగా అయితే దెబ్బలాడుతాం. బడ్జెట్లో కేంద్రం పోలవరానికి రూ.100 కోట్లే కేటాయించింది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మాట్లాడాను. ఒక నెలలో క్లారిటీ ఇస్తానని చెప్పారు. ఈ నెల 10 తరువాత ఢిల్లీకి వెళ్లి, అన్ని విషయాలు కేంద్రంతో మాట్లాడుతా. పోలవరం ప్రాజెక్ట్ను ఎవరు పూర్తి చేయాలనే దానిపై నాకు పంతాలు లేవు. దీన్ని జాతీయ ప్రాజెక్టుగా తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసినా నాకు ఇబ్బంది లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీపడి ముందుకు వెళ్తున్నా. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్ట్లను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేస్తాం’’ అని సీఎం స్పష్టం చేశారు.
పసుపు చొక్కాలకు పనులవుతాయి
పసుపు చొక్కాల వాళ్లు సమాజంలో భాగం కాదా? వాళ్లు మాకు ఓట్లేసారు, వాళ్ల పనులే అవుతాయి అని చంద్రబాబు సమర్థించుకున్నారు. కాపు కార్పొరేషన్ రుణాలన్నీ పసుపు చొక్కాలకే ఇస్తున్నారన్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోపణలను ఒక విలేకరి ప్రస్తావించగా ముఖ్యమంత్రి స్పందించారు. తమకు ఓటేసిన కాపులకు ప్రభుత్వ పథకాలను అందించడంలో తప్పు లేదన్నారు. కుల , ప్రాంతీయ విభేదాలను సృష్టించి రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విలేకరుల సమావేశంలో నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

No comments:
Post a Comment