MENU

Pages

Menu

January 27, 2016

గల్ఫ్ మోసాలపై సినిమా...!!!


సిరిసిల్ల రూరల్: గల్ఫ్ వలస కార్మికుల కష్టాలు, నేత కార్మికుల జీవితాలపై సినిమాను రూపొందిస్తున్నట్లు ప్రముఖ సినీ దర్శక, నిర్మాత వై.సునీల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన చిత్ర నిర్మాణ యూనిట్‌తో కలిసి కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో పర్యటించి నేత కార్మికుల జీవన విధానంపై అధ్యయనం చేశారు. వస్త్ర పరిశ్రమ, కార్మికుల కష్టాలను సైతం గల్ఫ్ సినిమాలో చూపించనున్నట్లు చెప్పారు. సిరిసిల్ల మండలం తంగళ్లపల్లి ఎల్లమ్మ దేవాలయం ఆవరణ, దేశాయిపల్లి గుట్టలు, జిల్లెల్లలోని పురాతన గడీని సందర్శించి వాటి చరిత్రను అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణ పండుగలు, విశిష్టత, ప్రజల జీవన విధానం, వలసలకు కారణాలు, గల్ఫ్ మోసాలు, గల్ఫ్ బాధితుల సమస్యలపై సిరిసిల్ల, పరిసర గ్రామాల్లో పిబ్రవరి 8 నుంచి 11 వరకు పాటలు, సన్నివేశాలను చిత్రికరీంచనున్నట్లు చెప్పారు. ఇప్పటికే పోచంపల్లిలో పలు సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలిపారు. గల్ఫ్‌లో ఆత్మహత్యలకు పాల్పడ్డ వారి కుటుంబాలను కూడా కలసి పలు విషయాలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు. ఆయన వెంట కెమెరామన్ జయరాం, ఆర్ట్ డెరైక్టర్ నాగు, గల్ఫ్ వలసవాదుల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యుడు జనగామ శ్రీనివాస్, లయన్స్ క్లబ్ రీజినల్ చైర్మన్ గుగ్గిళ్ల జగన్‌గౌడ్ ఉన్నారు.

No comments:

Post a Comment